అట్టడుగు స్థాయి నుంచి సినీ వినీలాకాశంలోకి అడుగుపెట్టిన రజనీకాంత్... తమిళ సినీ రంగంలోనే కాకుండా యావత్తు దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. వయసు మీదపడుతున్నా నటనలో తనకు తానే సాటి నిరూపించుకుంటూ వస్తున్న ఈ తమిళ సూపర్ స్టార్... తాజాగా ప్రజోపయోగ కార్యక్రమాలకు విరివిగా విరాళాలిచ్చే విషయంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. 



నదుల అనుసంధానం కోసం తమిళ సినీనటుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్ రూ.కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు రజనీ సోదరుడు సత్యనారాయణ సోమవారం ప్రకటించారు. నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. 



దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలుపునకు రజనీకాంత్ స్పందించి.. తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారని, రూ.కోటి డిపాజిట్‌ చేశారని అన్నారు. ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన నేపథ్యంలో.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తూ తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో సత్యనారాయణ పూజలు నిర్వహించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: