చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ చేతుల్లో పెడుతున్నారు. ఈ మేరకు స్విస్ ఛాలెంజ్ పద్దతిలో అమరావతిని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. అదేంటి అంటే.. అంత బ్రహ్మాండంగా అమరావతి కట్టేవారు ఇంకెవరూ లేరంటున్నారు. అమరావతిని సింగపూర్ గా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని చెబుతున్నారు.
ఐతే.. ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో టెండర్లు గట్రా వ్యవహారం లేకుండా సింపుల్ గా తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిని ఎంచుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసంచలన విషయం వెలుగు చూసింది. చంద్రబాబు అమరావతి నిర్మాణం కట్టబెట్టిన సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీలకూ చంద్రబాబు కొడుకు, కోడలుకూ సంబంధం ఉందన్న విషయం బయటపడింది.
సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీలు టెమాసెక్ హోల్డింగ్స్ అనే మరో కంపెనీ చేతుల్లో ఉన్నాయట. వీటితో పాటు వెర్టెక్స్ వెంచర్స్ అనే మరో కంపెనీ కూడా అమరావతి నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందట. ఈ కంపెనీలో గతంలో చంద్రబాబు కోడలు, నారాలోకేష్ భార్య బ్రాహ్మణి పనిచేశారట. ఈ విషయం ఆ కంపెనీ నివేదికల్లో స్పష్టంగా ఉంది.
అంతే కాదు.. ఈ టెమాసెక్ హోల్డింగ్స్ ఈ మధ్యనే హైదరాబాద్ లో వ్యాపారాలు ప్రారంభించిందట. ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం అప్పగించబోతున్న సంస్థలో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ గత ఏడాది జూన్ లో భాగస్వామి అయ్యిందట. ఇదంతా కాకతాళీయం కాదని.. ఈ పరిణామాల వెనుక పెద్ద స్కామే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఆలోచించాల్సిందే.