ప్రపంచ వ్యాప్తంగా పెను విధ్వంసానికి పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా భాగ్యనగరి హైదరాబాదులో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. దేశవ్యాప్తంగా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రదాడులకు వ్యూహం రచించాలన్నది ఈ గ్రూప్‌ లక్ష్యం. అంతేకాకుండా పక్కా ప్లాన్ తో వారు హైదరాబాదులోకి ప్రవేశించారు.  



వీరి ప్రయత్నాల్ని పసిగట్టిన ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం స్థానిక పోలీసుల సహకారంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.



హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పథకం రచించినట్లు సోదాల సందర్భంగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరింత మంది బలగాలను రంగంలోకి దించిన ఎన్ఐఏ... పాతబస్తీలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జనవరిలో కూడా సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఓ బృందంగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నిన వైనాన్ని ఎన్‌ఐఏ బృందం గుర్తించింది. అప్పుడు కూడా దాడులు నిర్వహించి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. ఆసమయంలో కూడా హైదరాబాద్‌ లోనే తొలుత అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: