చైనా కేంద్రంగా స్మార్ట్ ఫోన్ల విక్రయ సంస్థ అప్పో, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మొబైల్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 1000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన అప్పో ప్రతినిధులు, తమ ప్లాంటులో 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏపీని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని గుయాంగ్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.చైనాలో సీఎం చంద్రబాబు నాలుగో రోజు పర్యటనలో భాగంగా గుయాంగ్ సిటీ వైస్గవర్నర్ను కలిశారు. నీరు-చెట్టు విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
హార్డ్వేర్కు ఎంతో డిమాండ్ ఉందని, పాలనలో ఐటీ వినియోగంలో తాము ముందున్నామని చంద్రబాబు వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, 21 రోజుల్లో సింగిల్ డెస్క్ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. అనంతరం అప్పో మొబైల్ ఉత్పత్తుల సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇరిక్, ఎండి జోన్, ప్లానింగ్ డైరెక్టర్ స్పెటర్తో చంద్రబాబు భేటీ అయ్యారు. భారత్లో హార్డ్వేర్కు ఎంతో డిమాండ్ ఉందని వివరించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ పరిపాలనలో ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంలో తాము ముందున్నట్లు తెలిపారు. జులైలో ఏపీలో పర్యటించి భూములు ఎంపిక చేసుకోవాలని ఒప్పొ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్ చైనా యూనికామ్ను సందర్శించిన చంద్రబాబు దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్స్కాన్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ను చంద్రబాబు పరిశీలించి వారితో మాట్లాడారు.
అనంతరం చంద్రబాబు బృందం గుయాన్ సిటీలోని చైనా యూనికామ్లో పర్యటించారు. ఈ సందర్భంగా చైనా యూనికామ్ ఎలా పని చేస్తోందో నగర మేయర్ లఘు చిత్రం ద్వారా చంద్రబాబుకు వివరించారు. గుయాన్ నగరంలోని ఆరు విశ్వవిద్యాలయాలను సీఎం బృందం సందర్శించింది. గుయాన్ మెడికల్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు.