ఇటీవల టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆ దేశంలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఆ దేశ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 50 వేల మందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తయీప్ ఎర్డగాన్ ప్రభుత్వం తాజాగా ఆ దేశంలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు తయీప్ ఎర్డోగాన్ ప్రకటించారు. క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో సైనిక స్వేచ్ఛకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కొలవడానికి కొలమానాలు లేవన్నారు. సైనిక దళాల ఛీఫ్ గా తాను సైనికులలోని వైరస్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సైనిక కుట్రలో విదేశాల హస్తం ఉందని ఎర్డోగాన్ ఆరోపంచారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.
టర్కీ జాతీయ భద్రతామండలి, కేబినెట్ సమావేశమైన అనంతరం ఈ మేరకు టర్కీ అధ్యక్షుడు తయీప్ ఎర్డగాన్ ఈ ప్రకటన చేశారు. సైనిక తిరుగుబాటుకు అమెరికాలో ఉంటూ ఉగ్రవాద సంస్థను నడిపిస్తోన్న ఫెతుల్లా గులెన్ అనే వ్యక్తే కారణమని నిన్న ఆ దేశ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తిరుగుబాటుకి ఉగ్రవాదుల హస్తం ఉందన్న అనుమానంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితి విధించారు.
60 వేల మంది సైనికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేసిన 246 మందిని హతమార్చినట్టు, అందులో 24 మంది సైనికులు కూడా ఉన్నట్టు ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,200 మంది విద్యాశాఖ అధికారులను, 21 వేలమంది ఉపాధ్యాయులను, 1500 మంది ఆర్థిక శాఖ అధికారులను, 1,577 మంది యూనివర్సిటీ డీన్లను, ప్రధానమంత్రి కార్యాలయంలోని 257 మంది అధికారులను తొలగించారు. 600 ప్రైవేట్ పాఠశాలను మూసివేశారు.