అనంతపురం జిల్లాలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. చంద్రబాబు నగర్లో పరిటాల రవి వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. గోపీనాయక్, వెంకటేష్ నాయక్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు. చంద్రబాబు నగర్‌కు చెందిన గోపినాయక్‌, వెంకటేష్‌ నాయక్ గురువారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతుండగా వారిని ఓ ఆటో ఢీకొట్టింది. ఆటోలో నుంచి  కొందరు వ్యక్తులు వేటకొడవళ్లతో గోపీ, వెంకటేష్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడినవ వారు అక్కడిక్కడే మృతి చెందారు.

అనంతపురంలో భగ్గుమన్న పాతకక్షలు


జరిగిన జంట హత్యలకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిదే బాధ్యత అని మృతుల బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేనే ఈ హత్యలు చేయించారని, గత ఆరు నెలలుగా హత్యలకు కుట్ర పన్నారని వారు వ్యాఖ్యానించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మృతుల బంధువులు  నారాయణ నాయక్, కుమార్ నాయక్, భాస్కర్ నాయక్ డిమాండ్ చేశారు.



మృతులిద్దరు బంధువులు. కాగా వీరిద్దరూ నర్సింహలు అనే వ్యక్తి హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.  గతంలో వీరిపై నాలుగుసార్లు హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో మృతులకు విభేదాలు ఉన్నాయి. కాగా హత్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు జంట హత్యల కేసులో ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ తెలిపారు. టీడీపీ ఎంపీటీసీ అకులప్ప సహా 9మందిపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: