తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొంతుపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు దాదాపు ఏడాది కాలంగా ముందుకు సాగడంలేదు. అప్పట్లో ఎమ్మెల్సీ స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు ఎవరైనా ఇమిటేట్ చేసిందా లేక, వాస్తవమైనవా అనే విషయమై నివేదికను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ ఇచ్చింది. అవి అసలైనవే తప్ప ఇమిటేట్ చేసినవి కావని అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దాంతోపాటు ఈ స్వరం చంద్రబాబు నాయుడిదేనని కూడా శాస్త్రీయంగా నిర్ధారించారు.
ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు.
గత కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్న ఈ కేసులో పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ప్రకంపనలు రేగుతున్నాయి. ఇక అయిపోయింది అనుకున్న ఈ కేసులో తిరిగి విచారణ జరపాలని ఆదేశాలు ఇవ్వడంతో తెలుగుదేశం శ్రేణుల్లో గుబులు రేగుతోంది. ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక పసుపు పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. సలహా ఇవ్వాలని ఓ నెటిజన్ ట్విట్ చేశారు.