భారీ వర్షం - ఎమర్జెన్సీ నెంబర్లు ఇదుగో
హైదరాబాద్ నగరం భారీ వర్షంతో అతలాకుతలం అయింది. బుధవారం ఉదయం నుంచి కుంభవృష్టిగా కురిసిన వర్షంతో నగరం అస్తవ్యస్తమయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ను విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమీషనర్ బొంతు రామ్మోహన్ అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర పరిస్థితులను కో-ఆర్డినేట్ చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ : 040-21111111 లేదా 100కు డైల్ చేసి కూడా సమస్యలను తెలియజేవచ్చు.
సాధారణం కంటే 3రెట్లు ఎక్కువ : కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ఇవాళ కురిసిన కుంభవృష్టి వర్షం పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. వర్షం సాధారణం కంటే మూడు రెట్లు అధికమని కేటీఆర్ తెలిపారు. నగరంలో 20 మి.మీ వర్షం కురిస్తే అది సాధారణమని, కానీ ఇవాళ అంతకు మించి 60మి.మీ వర్షం కురిసిందని, ఈ సీజన్ లో అదే అత్యధిక వర్షంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరో 24 గంటలు వానలే వానలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటలపాటు కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు
మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తమిళనాడు గవర్నర్గా ఉన్న రోశయ్య పదవి ముగిసింది. ఈమేరకు పూర్తిస్థాయి గవర్నర్ను నియమించే వరకు విద్యాసాగర్రావు తమిళనాడు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాట నూతన గవర్నర్గా ఎవరిని నియమించబోతున్నారన్నది తెలాల్సి ఉంది.
సొంత గూటికి దేవినేని
తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన దేవినేని రాజశేఖర్(నెహ్రూ) చాలాకాలం తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరైన నెహ్రూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. నెహ్రూ, ఆయన కుమారుడు-యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాశ్ సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయనను కలుసుకున్నారు. సెప్టెంబర్ 15న సాయంత్రం విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన అనుచర వర్గంతో టీడీపీలో చేరాలని నెహ్రూ నిర్ణయించారు.
ఆ కేసులో చంద్రబాబే దోషి: రఘువీరా
ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే దోషి అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విజయనగరంలోని బాలాజీ నగర్లో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయానికి రఘువీరా శంకుస్థాపన చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ఎంత త్వరగా నివేదిక ఇస్తే అంత త్వరగా చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఈ సందర్భంగా రఘువీరా అన్నారు.
నయీం కీలక అనుచరుడి అరెస్ట్
గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు లొంగిపోయాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన వ్యక్తిని శ్రీహరిగా గుర్తించారు. సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు.