హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించి, నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే కేటీఆర్కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని సూచించారు. కూల్చివేతల వివరాలను రోజువారీగా తనకు పంపించాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులుతో సైతం కేసీఆర్ మాట్లాడి కూల్చివేతల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సూచించారు.
భారీ వర్షాల కారణంగా నగరంలో తలెత్తిన పరిస్థితులపై మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన సూచనలను, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్రావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు బి.జనార్దన్రెడ్డి, చిరంజీవులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్మిట్టల్ తదితరులతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని నాలాలపై కట్టడాలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. కూల్చిన వాటిని తిరిగి నిర్మిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడానికి సైతం వెనుకాడవద్దని నిర్ణయించింది. అంతేగాకుండా కూల్చివేతల ఖర్చును సైతం వారి నుంచి వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ యాక్ట్లోని 669 సెక్షన్ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఒత్తిళ్లకు తలొగ్గవద్దంటూ ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో మంగళవారం మరింత ముమ్మరం చేశారు. నాలాలపై నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలతోపాటు శిథిలమైన భవనాలను కూల్చివేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 204 నిర్మాణాలను కూల్చివేశారు.
కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ కూల్చివేతల పురోగతిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎన్నింటిని కూల్చివేశారు? మున్ముందు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? తదితర వివరాలు అడిగి తెసుకున్నారు. మంత్రి కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని అధికారులకు నొక్కి చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా కూల్చివేతలు పూర్తిచేయాలని ఆదేశించారు.