హైరదాబాద్: జైల్లోనే ఉంటూ రాష్ర్ట రాజకీయాలను తన కనుసైగల్లో నడిపిస్తున్న ఒకే ఒకడు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఉండగానే జరిగిన ఉప ఎన్నికల్లో 15మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు అనేక మంది తాజామాజీ ప్రజాప్రతినిధులు తన పార్టీలోకి వచ్చే విధంగా చక్రం తిప్పుతున్నాడు. జైలు నుంచి రాష్ర్టపతి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలనేది నిర్ణయించిన జగన్ ఇప్పుడు జైలు నుంచి మరో ముఖ్య నాయకుణ్ణి వైఎస్ఆర్ సీపీలోకి రప్పించడానికి స్కెచ్ వేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ దర్శకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావును వైఎస్ఆర్ సీపీలోకి తెప్పించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. దాసరిని చేర్పించుకోవడం కోసం తన బంధువు, సినీ నటుడు, దాసరి ప్రియ శిష్యుడైన మంచు మోహన్ బాబును అస్త్రంగా చేసుకుని పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత వారంలో మోహన్ బాబు తన కుమారుడైన విష్ణుతో కలిసి చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ను కలిసిన విషయం విధితమే. అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు త్వరలోనే జగన్కు మంచి రోజులు వస్తాయనీ, మహాభారతంలో శకునుడు ఒక్కడేననీ కేంద్రంలో మాత్రం అందరూ శకునులే ఉన్నారంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. మోహన్ బాబు కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోయడంతో ఇక ఆయన జగన్ పార్టీలోకి చేరుతారనీ మీడియా అంత కోడై కూసింది. అయితే, దీని వెనక బాగానే తతంగం నడిచినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు వైఎస్ఆర్ లోకి వస్తారనీ ప్రచారం జరిగింది. వాస్తవానికి జగన్ మాత్రం దాసరిని పార్టీలోకి రప్పించేందుకు మోహన్ బాబుతో మంతనాలు నడిపినట్లు తెలుస్తోంది. దాసరి సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ లో చేరిన దరిమిలా దాసరి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే దాసరికి పార్టీలో సముచిత స్థానం కలిపించడానికి హామీ ఇచ్చారనీ తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ విస్మరించిన దాసరికి తమ పార్టీలోకి వస్తే రాజ్యసభ సీటును కూడా ఇస్తామనీ చెప్పాల్సిందిగా మోహన్ బాబుతో జగన్ కబురుపెట్టినట్లు సమాచారం. దాసరి రాకతో ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా చిరంజీవికి చెక్ పెట్టడంతో పాటు ఆ సామాజిక వర్గాన్ని కూడా వైఎస్ఆర్ సీపీ వైపు ఆకట్టుకోవచ్చనేది జగన్ ఎత్తుగడగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే పనిలో మోహన్ బాబు ఉన్నట్లు జోరుగా చర్చనీయాంశంగా మారగా, ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. దటీజ్ జగన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: