ఉత్తర ప్రదేశ్ లో తండ్రీ కొడుకుల మధ్య జరుగుతున్న రాద్ధాంతం ఒకప్పటి ఏపీ రాజకీయాన్ని గుర్తు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ అఖిలేష్ యాదవ్ - ములాయం సింగ్ ల మధ్య రాజకీయ సంక్షోభం ఏర్పడి తమ పార్టీ గుర్తు సైకిల్ కోసం పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. మొత్తం మీద అఖిలేష్ కి బలం ఎక్కువ ఉండడం తో అతనికే సైకిల్ గుర్తు ని కట్టబెట్టింది ఎలక్షన్ కమీషన్. ఇదే పరిస్థితి 1995 లో టీడీపీ లో ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు - ఎన్టీఆర్ ల మధ్యన రాజకీయ సంక్షోభం ఏర్పడగా ఒకవైపు అల్లుడు మరొక వైపు మామ ఎన్టీఆర్ సైకిల్ గుర్తు కోసం పెద్ద పోరాటమే చేసారు. చివరికి సైకిల్ గుర్తు అల్లుడి చేతిలో పడింది. అది ఏపీ లో జరిగిన అతిపెద్ద రాజకీయ పరిణామం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ లో పరిస్థితీ అప్పటి ఏపీ లో పరిస్థితీ ఒకేలా ఉన్నాయి. తండ్రి ములాయం సింగ్ యాదవ్, తనయుడు అఖిలేష్ యాదవ్ లు సైకిల్ గుర్తుకోసం పోరాడారు. చివరకు తనయుడికే సైకిల్ దక్కింది. ఏపీలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన పార్టీ పెట్టే సమయానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. ఆయన పార్టీ పెట్టే నాటికి అఖిలేష్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నాడు. రాజకీయాలలో తండ్రీ కొడుకులు అయనా మామా అల్లుళ్ళు అయినా అధికార దాహం కోసం విడిపోతారు అనేది ఎన్నో వేల సార్లు ప్రూవ్ అవుతూ వస్తోంది. సైకిల్ సింబల్ కోసం నిరంతరం పోరాటం చేసిన చంద్రబాబు అప్పట్లో డిల్లీ పెద్దల సహకారం తో ఈసీ ని ఒప్పించి మరీ సైకిల్ ని తనవైపు లాక్కున్నారు .