రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాదులు ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26న ఢిల్లీలోని కోర్టులపై దాడి చేయడానికి పథకం వేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. ఢిల్లీలోని ప్రతీ అణువణువు గాలింపు చేస్తున్నాయి. 


కొన్నిరోజులుగా ఢిల్లీలో తలదాచుకున్న ఐసిస్‌ సానుభూతిపరులు.. రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టులపై దాడి చేసేందుకు వ్యూహం పన్నారని నిఘా సంస్థలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాయి. ఐసిస్‌ ఉగ్రవాదులు తొలుత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. తరువాత  ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకుని కోర్టులు, ఇతర ప్రాంతాల వైపు మళ్లించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. 


రిపబ్లిక్ డే వేడులకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ పోలీస్‌ లు తెలిపారు. ఐసిస్ భావజాలానికి దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఆకర్షితులవుతున్నట్టు తొలుత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కాగా ఉత్తర భారతదేశంలోనూ ఐసిస్కు సానుభూతిపరులున్నట్టు సమాచారం అందడంతో.. నిఘా వర్గాలు ఆదిశగా దృష్టి సారించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: