ఏపీలో సీఎం ముఖ్యమంత్రే అయినా ఆయన కుమారుడు లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. మంత్రులపై లోకేశ్ పెత్తనం పెరిగిపోతోందంటూ కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఏకంగా హోంమంత్రి చినరాజప్పపైనే ఆయన దురుసుగా ప్రవర్తించారంటూ గతంలో సాక్షి పత్రిక రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. 



మంత్రుల పనితీరును లోకేశ్ రివ్యూ చేస్తున్నారట కూడా.. ఐతే.. తాజాగా ఆయన ఓ మంత్రిని పీకేయిస్తానంటూ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారట. సదరు మంత్రిపై ఫిర్యాదు చేసిన కార్యకర్తలకు... మీరేం ఫీల్ కాకండి.. 15 రోజుల్లో ఊహించని నిర్ణయం వస్తుందంటూ చెప్పారట. ఆ ఇంకేముంది.. 15 రోజుల్లో ఆ మంత్రిని పీకేయిస్తారని ఆయన వ్యతిరేకులు సంతోషపడుతున్నారట. 



ఇంతకీ  ఆ మంత్రిగారు ఎవరో చెప్పలేదు కదూ.. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు.. ఇటీవల కిషోర్ బాబు పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గుంటూరు జెడ్పీ ఛైర్మన్ తో పంచాయతీ పెట్టుకున్నారు. ఆయన వల్ల ఆత్మహత్య కూడా చేసుకుంటానని ఆమె మీడియాకెక్కింది కూడా. చంద్రబాబు ఏదో కమిటీ వేసి మొత్తానికి రాజీ కుదిర్చారు. 



అంతకుముందు.. రావెల కుమారుడు హైదరాబాద్ లో ఓ ముస్లిం యువతిని వేధించిన సంగతి కూడా తెలిసిందే. ఈ వివాదాలతో పాటు.. రావెల కిషోర్ బాబు పనితీరుపైనా లోకేశ్ సంతోషంగా లేరట. దీనికి తోడు కార్యకర్తల ఫిర్యాదులు కూడా ఎక్కువకావడంతో ఇక రావెల పదవికి ఎసరు వచ్చినట్టేనని టీడీపీలో టాక్ నడుస్తోంది. మరి ఈ పీకుడు వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: