కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ బస చేసిన గెస్ట్ హౌస్లో డోర్ లాక్ రిపేరి చేయించనందుకు అసిస్టెంట్ ఇంజినీర్ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోని 107 నెంబర్ గదిలో గత ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆయన బస చేశారు. సీఎం బస చేసిన మొదటి రోజు నుంచి ఆ గది డోర్ లాక్ పడటం లేదు. మొదటి రోజు కేరళ సీఎం గది లోపల డోర్ లాక్ వేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు.
అధికారులు ప్రయత్నించి చూసినా వీలుకాలేదు. ఆ మరుసటి రోజు సీఎం భద్రత సిబ్బంది ఈ విషయాన్ని గెస్ట్ హౌస్ మేనేజర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆగ్రహించిన సీఎం, తనకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే, ఇక, సామాన్యుల పరిస్థితి ఏంటంటూ అధికారులపై మండిపడ్డారు. . ఈ ఘటనపై విచారణ చేసిన అధికారులు, ఇందుకు బాధ్యుడిగా ప్రజాపనుల శాఖ ఏఈని సస్పెండ్ చేశారు. ఈ దెబ్బకు అలువా గెస్ట్ హౌస్లో అన్ని డోర్లను రిపేర్ చేయడమో లేక మార్చడేమో చేశారు.
ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ వర్గీయులు విమర్శిస్తున్నారు. అచ్యుతానందన్ సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఇదే గదిలో బస చేశారట. ఆయనెప్పుడూ డోర్ లాక్ చేసుకోలేదట. అత్యంత భద్రత ఉండే సీఎంకు డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అచ్యుతానందన్ వర్గీయులు విమర్శిస్తున్నారు.