దేశ పౌరుల్లో జాతీయ‌తా భావం, సమైక్య‌త‌ను నింపేందుకు సినిమాహాళ్లలో చిత్రం ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన విధిగా చేయాలని సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. సినిమా థియేటర్లలోనైనా, మరెక్కడైనా జాతీయ గీతం వినబడితే లేచి నిలబడాలన్నది నియమం. అయితే అందులోనూ వృద్ధులు, వికలాంగులకు మినహాయింపు ఉంది. సినిమా సీన్ల‌లో జాతీయ గీతాలాప‌న వ‌చ్చిన స‌మ‌యంలో కూడా దేశ భ‌క్తిగ‌ల పౌరులు లేచి నిల‌బ‌డుతున్నారు.



బాలీవుడ్ న‌టుడు ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రం ప్రదర్శిస్తుండగా ఓ వృద్ధుడిపై ఈ దాడి జరిగింది. ముంబయి శివారు ప్రాంతమైన గోరెగావ్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూడ్డానికి వచ్చిన వారిలో వృద్ధుడైన అమల్‌రాజ్‌ దాసన్‌పై ఈ దాడి జ‌రిగింది. అయితే, వృద్ధులు, వికలాంగులు జాతీయగీతం వ‌స్తున్న‌ప్పుడు లేచి నిల‌బ‌డాల‌ని మాత్రం లేదు. ఇది తెలియ‌ని ఓ వ్యక్తి ఓ వృద్ధుడిపై దాడికి దిగాడు.



దంగల్‌ సినిమాలోని ఓ సన్నివేశంలో మహావీర్‌ ఫొగట్‌(ఆమిర్‌ఖాన్‌) కూతురు స్వర్ణ పతకం సాధించిన సమయంలో జాతీయగీతం వచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ సమయంలో థియేటర్‌లో ఉన్న వారందరూ నిలబడి జాతీయ గీతం ఆలపిస్తున్నారు. కానీ 59ఏళ్ల దాసన్‌ లేచి నిలబడకపోవడంతో హాల్‌లో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా దాసన్‌పై దాడికి దిగి చెంపచెళ్లుమనిపించాడు. వృద్ధుడిపై దాడి చేశాడని ఇతరులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి దాడి చేసిన వ్యక్తి శిరీష్‌ మధుకర్‌ని అరెస్టు చేసి ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: