తమ ప్రాచీన, సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కు సుప్రీం అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో తమ క్రీడకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమిళులు చెన్నై సాగర తీరాన మెరీనా బీచ్ లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ ఉద్యమం కాస్తా ప్రశాంతతను వీడి వికృత రూపం దాల్చడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్యమాన్ని చల్లార్చడానికి బదులు వారే సంఘటనా స్థలంలో వాహనాలను ధ్వంసం చేయడం పెద్ద కలకలమే రేపిన విషయం అందరికీ విదితమే. 



ఈ నేపథ్యంలో కమలహాసన్ మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల తీరు తనను షాక్ కు గురిచేసిందని, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఆటోలకు పోలీసులే నిప్పు పెట్టిన వీడియోను కమల్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. జంతు హక్కులపై తనకు అవగాహన లేదని, ‘జల్లికట్టు’ ఉద్యమం సంస్కృతి పరిరక్షణ కోసం జరుగుతున్నదని అన్నారు.  ఈ సందర్భంగా పాకిస్థాన్ అంశంపై కూడా కమల్ మాట్లాడారు.



ఆ దేశాన్నివిమర్శించడం తనకు ఇష్టం లేదని, సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నామని అభిప్రాయపడ్డారు. యువతపై జరిగిన పోలీసుల లాఠీఛార్జిని తాను ఖండిస్తున్నానని, జల్లికట్టు క్రీడపై నిషేధం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు. దేన్ని నిషేధించవద్దని, కేవలం ఆంక్షలు మాత్రమే విధించాలని కమల్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: