104 ఉపగ్రహాలను ఒకే స్పెస్-షిప్ ద్వారా అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఇస్రో ఘనత మనదేశానికెంతో కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. అదీ ప్రపంచం లో తిరుగులేని విజయం. మరొకరు వెంటనే ఆ ఘనత సాధించటం అంత తేలిక కాదు. దీనికంతటికి కారణం మన శాస్త్రవేత్తల ప్రతిభే. అయితే "లోకం దారొకటైతే ఉలిపిరికట్టె దారి మరొకటన్న" సామెత ప్రకారం చైనా మీడియా మొదట అదేమీ గొప్ప విజయం కాదంది. తరవాత కళ్ళు తేలేసి భారత్ ను పొగిడింది. కొత్తగా ఇప్పుడు తమ దేశానికి మాత్రం బాగానే చురకలంటిస్తోంది. సెటైర్స్ కాస్త ఘట్టిగానే వేస్తుంది.
అసలు కథేమంటే, ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి ప్రపంచ స్పేస్ రికార్డును నెలకొల్పిన ఇస్రోను పొగడ్తల్లో ముంచెత్తుతున్న బీజింగ్ మీడియా, తమ దేశానికి మాత్రం బాగానే చురకలంటిస్తోంది. భారత్ కు చెందిన సైన్సు, టెక్నాలజీ నిపుణులను విస్మరించి చైనా తప్పుచేసిందని బీజింగ్ మీడియా శుక్రవారం పేర్కొంది. భారతీయ మేథోసంపత్తిని పక్కకుపెట్టి, యూఎస్, యూరప్ నుంచి వచ్చే వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ రంగ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ ఆర్టికల్ ప్రచురించింది. భారతీయ సైన్సు, టెక్నాలజీని ఆకట్టుకోవడానికి చైనా అసలు సరిగా పనిచేయలేదని తన ఆర్టికల్ లో పేర్కొంది.
ఇస్రో ఘనవిజయం తర్వాత గ్లోబల్ టైమ్స్ భారత్ కృషిని కొనియాడుతూ పలు వ్యాసాలు ప్రచురిస్తూ వస్తోంది. గత కొన్నేళ్లుగా చైనా-టెక్ లో జాబ్స్ , అనూహ్యమైన బూమ్ సాధించింది. ఫారిన్ రీసెర్చ్ కు, డెవలప్మెంట్ సెంటర్లకు చైనా ఆకర్షణీయమైన దేశంగా పేరొందింది. కానీ ఇటీవల కొన్ని హై-టెక్ సంస్థలు చైనా నుంచి భారత్ కు వస్తున్నాయి. తన నూతనావిష్కరణ సామర్థ్యాన్ని అలానే కొనసాగిస్తూ భారత్ నుంచి హై-టెక్ టాలెంట్ ఆకర్షించడం ప్రస్తుతం చైనా వద్దనున్న ఒక ఆప్షన్ గా ఆ మీడియా పేర్కొంది.
అంటే చైనాకు భారత్ సాంకేతిక పరిజ్ఞానం లోని సత్తా బాగా తెలిసొచ్చిందన్న మాట.