ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తన తనయుడు లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువడానికి సమాలోచనలు చేస్తున్న విషయం అందరికీ విదితమే. దీనికి తోడుగా మంత్రులు, ఎమ్మెల్యే లు, పార్టీ కార్యకర్తలు లోకేష్ ను మంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.
అయితే ఈ డిమాండ్లను లోకేష్ ఉత్సాహాన్ని గమనించిన బాబు ఆయనకు ఎమ్మెల్సీ వదవిని ఇచ్చి ఆ తరువాత మంత్రి పదవిని కట్టబెట్టాలని వ్యూహాలు రచిస్తున్న సందర్భంలో లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏ పాల్.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్కు సోమవారం ఆయన హితబోద చేశారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న ఆయనను ఉద్దేశించి పాల్ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికలలో పోటీ చేసి, ఎమ్మెల్యేగా రావాలని అందులో సూచించారు. లోకేశ్ తరపున తాను ప్రచారం చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గద్దని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇప్పటికే నారా లోకేశ్ ఎమ్మెల్సీ పదవిని చేపట్టడం ద్వారా ఏపీ మంత్రి వర్గంలోకి అడుగుపెట్టబోతుండటంపై పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తూ పరోక్షంగా విమర్శలు చేస్తున్నాయి. దమ్ముంటే లోకేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టాలే తప్ప ఇలా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ముసుగు రావడమేమిటంటూ పెదవి విరుస్తున్నారు. పైగా తన సామర్థ్యాన్ని మెచ్చి పొలిట్ బ్యూరో తనకు ఎమ్మెల్సీ బాధ్యతలు కట్టబెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ లోకేశ్ ట్వీట్ చేయడంపై జనాలు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.