పవన్ కల్యాణ్ కుడా ఇంతేనా! దోపిడీ చేసే మన రెగ్యులర్ రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ కు ఈ క్రింద వార్త చదివితే పెద్ద తేడా లేదనిపిస్తుంది. అభిమానులను కూడా ఆయన నిర్ధాక్షిణ్యంగా వంచిస్తారా! నమ్మాలనిపించక పోయినా జరిగిన విషయం తెలుసుకోవటం ప్రజల హక్కు. వార్తలందించటం వార్తా వెబ్-సైట్లకు తప్పదు. సమాచారం వివరించటం మాకు తప్పదు. మరి సార్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులెలా ఉంటాయో అనేదే ప్రజల సంశయం.
"మీ రికార్డుల సాధనకు, అభిమానుల్లో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఇంత కక్కుర్తి పడతారా?" అంటూ కాటమరాయుడు చిత్ర నిర్మాణ సంస్థపై "ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్" మండిపడింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉన్న క్రేజ్ ని సొమ్ము చేసుకోవాలని కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధరను పెంచడాన్ని అసోసియేషన్ తీవ్రంగా నిరసించింది.
విషయం ఏమిటంటే వంద కోట్ల క్లబ్బులో ఎలాగైనా చేరాలనే దుగ్ధ, మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లు సంపాదించలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా తెలుగు సినీ నిర్మాత లు, హీరోలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈక్రమంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రూ.10/- రూపాయల టిక్కెట్టును రూ.50/- కి, అలాగే రూ.50/- రూపాయల టిక్కెట్చును రూ.200/- లకు, 150 /-రూపాయల టిక్కెట్టును రు.500/- లకు పెంచి ప్రేక్షకులను లూటీ చేయడం ప్రతి అగ్రహీరో సినిమాకు అలవాటైపోయింది.
తమ లాభాలకోసం జనాల జేబులను లూటీ చేస్తున్న ఈ అక్రమాన్ని అరికట్టాలని కోరుతూ ఆల్ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. కాటమరాయుడు సినిమా టిక్కెట్లను అడ్డంగా పెంచేసిన ఘటనపై మండిపడిన అసోసియేషన్, పవన్ కల్యాణ్ది కూడా లూటీ చేసే సిద్ధాంతమేనని సంఘ సభ్యులు ఆరో పించారు.
పైగా ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ వవన్ కల్యాణ్ తన పబ్బం గడుపుకుంటున్నారని అసోసియేషన్ ఆరోపించింది. బెనిఫిట్-షోల సాకుతో కొత్త సినిమాకు సంబంధించి ఒక్కో టిక్కెట్లు ధరను రూ.5000/- రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ధారుణమని విమర్శించింది. ఈ సమస్యపై అటో ఇటో తేల్చేంతవరకు పోరాడ తామని వివరించింది. ఇందుకు ప్రభుత్వాలు తలొగ్గి మద్దతు పలకడం దారుణమన్నారు. హీరోగా ప్రజలను దోచుకునే జనసేన అధ్యక్షుడు, ప్రజాసేవ పేరుతో ప్రజల్లోకి ఎలా వస్తాడని వారు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు లను వక్రీకరించి అదే హైకోర్టు ద్వారా అక్రమంగా నేల టిక్కెట్టు పెంచేసి అక్రమంగా కోర్టు ఉత్తర్వులు పొంది దోపిడికి రాజమార్గం వేసుకున్నారన్నారు.
మంగళవారం హైదర్గూడ ఎన్.ఎస్.ఎస్. లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జి.ఎల్. నర్సింహ్మారావు, సినీ హీరోల సంఘాల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచందర్రావు, సుధాకర్ మాట్లాడుతూ ప్రాణాల కన్నా మిన్నగా అభిమానించే ప్రేక్షకులను టిక్కెట్టు ధరలను ఇంత ధారుణంగా పెంచి దోపిడి చేయటం పవన్ కళ్యాణ్ లాంటి కథానాయకునికి తగదని అంటున్నారు.
అంతేకాదు, ప్రేక్షకులు కాటమరాయుడు సినిమాను మొదటి రెండు వారాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ టిక్కెటు కొన్నా దానిని జాగ్రత్తగా పెట్టుకుంటే సంబంధిత చిత్ర యూనిట్ పై కేసులు వేసి టిక్కెట్టు డబ్బులు వసూలు చేస్తామన్నారు. ప్రజలను దోపిడీ చేసే సినిమాలను బహిష్కరించాలని కోరారు. ఈ అక్రమ దోపిడిపై సినీపెద్దలు, ‘మా’ సంఘం, హీరోలు స్పందించకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కాటమరాయుడు సినిమాను సింగిల్గా టార్గెట్ చేయటం కంటే కొత్త సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఇలాంటి లూటీ పద్ధతు లకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏ చిత్ర నిర్మాతా, హీరో ఇలాంటి తప్పుడు పనులకు పాటుపడరు కదా!