కొద్దికాలంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్న బ్రిటన్లో ఒక్క సారిగా లండొన్లోని పార్లమెంట్ భవనానికి అతి దగ్గరలో పార్లమెంటు భవనాన్ని టాత్గెట్ చేస్టూ నిన్న ఉగ్రవాద దాడి జరిగింది. ఎకాయకీ బ్రిటన్ పార్లమెంటుపై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు ఉగ్రపంజా విసిరాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్న సమయములోనే ఈ భీబత్సం జరిగింది.
లండన్ థేమ్స్ బ్రిడ్జి పై కారుతో బీభత్సం సృష్టించి, సమీపంలోని పార్లమెంట్ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని, పార్లమెంట్ భవనం వద్ద ఓక పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండ గానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
పార్లమెంటు సమీపంలోని వెస్ట్మినిస్టర్ బ్రిడ్జిపై ఒక ఉగ్రవాది కారుతో బీభత్సం సృష్టించాడు. బూడిద రంగు హ్యుందాయ్ ఐ-40 కారులో పేవ్మెంట్ పైనున్న పాదచారు లపైకి దూసు కెళ్లాడు. ఇందులో ఓ మహిళ సహా ఇద్దరు చనిపోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. బ్రిడ్జిపై విధ్వంసం సృష్టించిన ఉగ్రవాది, అదే కారులో వెస్ట్మినిస్టర్ ప్యాలెస్(పార్లమెంట్ భవనం) వైపు వెళ్లాడు. అక్కడ కారు ఇనుప రెయిలింగ్ను ఢీకొని ఆగిపోయింది. పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ ), ప్రఖ్యాత బిగ్-బెన్ గడియారం ఈ భవనంలోనే ఉన్నాయి.
పార్లమెంట్ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడు అక్కడి ఒక పోలీసు అధికారి ని కత్తితో పొడిచాడు. మరో అధికారిని పొడవ బోతుండగా సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, శర వేగంగా దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు.
కాల్పుల మోత నడుమ, ప్రధాని థెరిసా మేను కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆమె క్షేమంగా ఉన్నారని, తన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. భద్రతా సిబ్బంది ఘటనా స్థలిని చుట్టు ముట్టారు. ఎమర్జెన్సీ హెలికాప్టర్ పార్లమెంటు ఆవరణలో దిగింది. ఎంపీలను, సిబ్బందిని పార్లమెంటు లోనే ఉంచారు. సమీప భవనాల్లోని ఉద్యోగులనూ బయటికి రానివ్వలేదు. కాల్పుల అలజడి తో హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలను నిలిపేశారు. మరోవైపు లండన్ నగరం మొత్తం క్షణాల్లో పోలీసు గుప్పిట్లోకి వెళ్లింది. పోలీసు హెలికాప్టర్లు నగరంలో పహారా నిర్వహిస్తూ పరిస్తితిని సమీక్షిస్తూ చక్కర్లు కొట్టాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధాని థెరిసా మే తో మాట్లాడారు. ఉగ్రపోరులో అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
లండన్పై ఉగ్తదాడిని భారత్ ఖండించింది. ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావే లేదని విదేశాంగశాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని, సంప్రదించాలని భారత హైకమిషన్ సూచించింది. ఈ దాడిలో ఫ్రాన్స్కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయని ఆ దేశ విదేశాంగ మంత్రి రుమైన్ నాదల్ చెప్పారు. వారంతా లండన్కు స్కూల్ ట్రిప్లో భాగంగా వెళ్లిన వారని తెలిపారు. విద్యార్థులంతా బ్రిడ్జిపై ఉన్నప్పుడు ఈ ముగ్గురిని కారు ఢీకొందని స్థానిక పత్రిక వెల్లడించింది.
పార్లమెంటు ఘటనకు సమీపంలోని ప్రెస్ అసోసియేషన్ సంస్థ పొలిటికల్ ఎడిటర్ ఆండ్రూ ఉడ్-కాక్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. తన ఆఫీసు కిటికీ గుండా అక్కడి భీతావహ పరిస్థితిని గమనించిన ఆయన వివరాలను ఇలా వెల్లడించారు. "అరుపులు, కేకలు వినిపించడంతో అటువైపు చూశాను. 40నుంచి 50మంది బ్రిడ్జ్-స్ట్రీట్ నుంచి పార్లమెంట్ స్క్వేర్ వైపు ఏదో తరుముకొస్తున్నట్లు పరిగెతుతూ వచ్చారు. భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్న క్యారేట్-గేట్స్ వద్దకు రాగానే ఆ గుంపులోంచి ఒక వ్యక్తి ఆవరణలోకి ఉరికాడు. అతని చేతిలో వంటగదిలో వాడే పొడవాటి కత్తి ఉన్నట్లు కనిపించింది"
ఆ ఉగ్రదానవుడి కత్తిపోట్లకు బలైన పోలీసు అధికారి ప్రాణాలు కాపాడేందుకు బ్రిటన్ విదేశాంగ సహాయ మంత్రి తోబియాస్ ఎల్వుడ్, క్షతగాత్రుడి నోటిలో నోరు ఉంచి శ్వాస అందించారు. రక్తస్రావం కాకుండా గాయాలను అదిమిపెట్టినా ఫలితం లేకుండా పోయిందని, ఆ అధికారి చనిపోయాడని తోబియాస్ తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఉగ్రదాడిలో తోబియాస్ సోదరుడు చనిపోవడం గమనార్హం.