తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్పగా కాకపోయినా కాస్తో కూస్తో అభిమాన హీరోగా మారాడు ఇళయ దళపతి విజయ్. దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు నాంధిపలికింది. ఇప్పటికీ అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తమిళనాడును జయలలిత స్థాయిలో సమర్థవంతంగా నడిపే మరో రాజకీయ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారా? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో తమిళ జనం సైతం అక్కడి సినీ తారల వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం అక్కడ రాజకీయాలు నడుపుతున్న వారు సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేనివారు. కానీ జయలలిత, కరుణానిధి వంటి వారు సినిమా నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో పాగా వేసినవారే కాబట్టి.. అక్కడి ప్రజల్లో అంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇస్తారని ఎదురు చూశారు..కానీ ఆయన రాజకీయాల పట్ల విముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రజనీ తర్వాత తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సైతం పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో చాలా మంది సినిమా తారలు రాజకీయ రంగప్రవేశం చేసి, కరుణాస్ లాంటి వారు శాసన సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. మిళనాట ప్రస్తుత పరిణాల్లో విజయ్ రాజకీయ తెరంగేట్రం చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ శుక్రవారం కన్యాకుమారిలో బదులిస్తూ నటుడు రాజకీయాల్లోకి రావడం పెద్ద కష్టమైన పని కాదని కాకపోతే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని పేర్కొన్నారు.
వాస్తవానికి గత 10 ఏళ్ల క్రితం తాను విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నించానన్నారు. అయితే ఇప్పటి రాజకీయ వ్యాపారం పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చట్ట నిబంధనల ప్రకారం నటుడైనా, నిర్మాత అయినా నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు.