రజనికాంత్ తమిళ రాజకీయాల్లోకి వస్తున్నాడా.. కొద్దికాలంగా ఈ అంశంపై తమిళనాడులో విపరీతమైన చర్చ జరుగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వార్తలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. అధికారంపై వ్యామోహం లేదని ఆయన పలుసార్లు చాలా క్లియర్ గానే చెప్పారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హఠాన్మరణంతో ఇప్పుడు తమిళనాడులో ప్రజాకర్షక నాయకత్వ కొరత కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా నడిపించే నాయకుడు లేకుండాపోయాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనికాంత్ కు ఇదే సరైన సమయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వచ్చేనెల రెండో తేదీన తన అభిమాన సంఘాల నాయకులతో రజనీ భేటీ కానున్నారు. పదేళ్ల తర్వాత ఇలాంటి సమావేశం జరగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఏప్రిల్ రెండో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అభిమాన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో రజనీ సమావేశం కానున్నారు. ఈ భేటీకి అందరూ తప్పకుండా చెన్నై రావాలని రజినీకాంత్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. సో.. రజనీకాంత్ ప్రకటన చూస్తుంటే ఏప్రిల్ 2 ఏదో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అది రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన అయితే తమిళ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతాయి.