పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించారు. ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఐదుగురు మృతి చెందారు..దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. ఆనంద కంపెనీపై గ్రామస్తుల రాళ్లదాడి చేశారు. కంపెనీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. స్థానికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి :
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లో ప్రమాద ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విషవాయు పీల్చి మృత్యువాత పడిన ఐదుగురు యువకుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుబానికి రూ.17లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్తో ఫోన్లో సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అక్కడి ఎమ్మెల్యేను ఆదేశించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : వైఎస్ జగన్
మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన మొగల్తూరుకు వెళ్లి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మొగల్తూరు పర్యటన కారణంగా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకున్నారు.
మొగల్తూరు బాధితులను ఆదుకోవాలి : పవన్ కళ్యాన్
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న ఇటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు.