రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 40 రోజులుగా తమిళ రైతులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. శనివారం కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు. రుణమాఫీ, కరవు సాయం చేయాలని త‌మిళ రైతులు రోజుకో విధంగా నిర‌స‌న‌లు తెలిపిన‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఇంత‌వ‌ర‌కు ఎటువంటి కొత్త ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. నెలకు పైగా ఢిల్లీలో వినూత్న రీతుల్లో నిరసన కొనసాగిస్తున్న తమిళనాడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానంటూ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ భరోసా ఇచ్చారు.



దీంతో రెండ్రోజులపాటు తమ ఆందోళనకు విరామమిచ్చారు. శనివారం అకస్మాత్తుగా జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగిన రైతులు మళ్లీ ఆందోళన బాట చేపట్టారు. దీంతో వీరిపై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు అయ్యాకన్నుతో సహా పలువురిని స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలిపెట్టారు. మరోవైపు, ఈ ఆందోళనను తాత్కాలికంగా వీడాలని రైతు నాయకుడు అయ్యాకన్నుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సూచించారు. అటు, రైతు బంద్‌కు నడిగర్‌ (దక్షిణ భారత నటీనటుల) సంఘం మద్దతు ప్రకటించింది.



విద్యార్థి సంఘాలు  బంద్‌ విజయవంతానికి పిలుపునిచ్చాయి. కాగా, నీతి ఆయోగ్‌ సమావేశానికి ఢిల్లీ వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదివారం ఉదయం రైతులకు కలవనున్నారు. 40వేల కోట్ల కరువు పరిహార ప్యాకేజీ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: