ఒకే దేశం, ఒకే ఎన్నికలు ప్రస్తుతం బీజేపీ కొత్త నినాదం. గత కొన్ని నెలలుగా కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులను ఆలోచింప జేస్తున్న ప్రశ్న ఇది. ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యం అయ్యే పనేనా..? మన దేశంలో ఆన్ని పార్లమెంట్ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరిగితే.. ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదా..? లాభం ఏమైనా ఉందా..? దీని వెనకాల రాజకీయ స్వార్థం ఏమైనా ఉందా..? కేవలం బీజేపీ ఓటు బ్యాంక్ ను కాపాడుకోవడానికే ఈ పన్నాగం పన్నుతుందా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి మూడో సమావేశం ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, జావడేకర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్నెంట్ గవర్నర్లు,ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ‘ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు’ అని ప్రధాని ఈ సందర్భంగా నినాదాన్ని ఇచ్చారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగాలని కోరారు.
అయితే ఈ విధానం ఇతర దేశాల్లో అమలు అవుతే ఎలా ఉంటుందో తెలియదు గానీ, మన దేశంలో అమలవుతే మాత్రం రాజకీయ అవినీతి మరింత పెరగడమే కాక మళ్లీ ఎన్నికలు లేవని నాయకులు అసలు పని చేయడమే మానేస్తారు. ఇప్పటి విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే ఇతర రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలపై అధికార పార్టీకి భయం ఉంటుంది. కాబట్టి నాయకులంతా శ్రద్దగా పనిచేస్తారు. కానీ ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం ఏ రాష్ట్రలో కూడా ఇక ఎన్నికలనే మాటే ఉండదు. అప్పుడు అనుకోకుండానే నాయకుల్లో అశ్రద్ధ పెరుగుతుంది.