జమ్ము కశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ మధ్యే జరిగిన ఉప ఎన్నికలో అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదవ్వటం, రోజు రోజుకూ సంక్లిష్ఠము మరియు జటిలమవుతున్న శాంతి భద్రతల సమస్య పై ఆమె తన ఆందోళనను మోదీతో వ్యక్తపరిచి చర్చించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఘర్షణ లపై కేంద్రం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని కోరినట్లు ముఫ్తీ చెప్పారు.
మోదీ పదే పదే తాను వాజ్పేయి బాటలో నడుస్తానని చెబుతుంటారు. ఘర్షణ కాదు సయోధ్య శాంతి సామరస్యం కోసమే చూస్తామని చెప్పారు. కానీ ముందు మనం పరిస్థితు లను చక్క దిద్దాలి వాతారణాన్ని సాధారణ స్థితికి తీసుకురావటం అత్యవసరం. రాళ్లు, బుల్లెట్ల మధ్య చర్చలు ఎలా సాధ్యం? అసాధ్యం కదా? అని మోదీ, తో చెప్పినట్లు మహబూబా ముఫ్తి స్పష్టంచేశారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో ఉద్రిక్తతలు సర్దుమణుగుతాయని, ఆ తర్వాతే చర్చలు జరుపటానికి అవకాశం రావచ్చని ఆమె వెల్లడించారు.
ఆ తర్వాత హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కూడా కలిశారు. చర్చల విషయంలో కేంద్రం అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మహబూబా ముఫ్తి స్పష్టంచేశారు. ఈ సమావేశాల్లో జమ్ము కశ్మీర్ రాష్ట్ర బాజపా ఇన్చార్జ్ రామ్మాధవ్ కూడా పాల్గొన్నారు.
రాళ్లు రువ్వడాలు, భద్రతా సిబ్బంది కాల్పులు రెండూ తక్షణమే ఆగిపోవాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై ప్రశ్నించగా, దానికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మహబూబా ముఫ్తీ అన్నారు.
ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీల భద్రత గురించి కూడా రాజ్నాథ్తో చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆమె, దేశములోని ప్రతి రాష్ట్రంలో ఉన్న తమ విద్యార్థులను సొంత బిడ్డలుగా చూసుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులను కోరారు. ఓవైపు ప్రధానితో ముఫ్తీ సమావేశం అవుతున్న సమయంలోనే ఒక పీడీపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపడం గమనార్హం.