హైదరాబాద్ లో ఓ మహిళ హత్య కలకలం సృష్టించింది. కూకట్పల్లి బాలాజీనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఐతే.. ఆ మహిళ మృతదేహంపై బట్టలు లేకుండా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్యే చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం లభించిన తీరు కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది.
ఈ హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రత్యూష రెడ్డి తన భర్త అంజిరెడ్డితో కలిసి కెపిహెచ్కాలనీ లో నివసిస్తోంది. మూడు నెలలుగా భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆమె గతంలో పరిచయం ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం.
మరో వ్యక్తితో చనువుగా ఉండే ప్రత్యూష బాలాజీనగర్లోని అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఒంటి పై బట్టలు లేకుండా కత్తిపోట్లతో మృతి చెందింది. పెంట్హౌస్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తీసి చూడగా ప్రత్యూష శవం కనిపించింది. ఆమెతో చనువుగా ఉండే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.