కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఫ్యాక్షన్ హత్య మళ్లీ రాయలసీమలో కలకలం రేపుతోంది. వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఐతే.. ఈ హత్య కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేఈ కుమారుడు శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. ఐతే.. ఈ కేసు నమోదులోనూ టీడీపీ నాయకులు తమ ఒత్తిడి ప్రదర్శించారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధాన నిందితుడు శ్యామ్ బాబును ఎ-14గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోనే అతన్ని తప్పించే ఆలోచన అర్థమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అండతోనే ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. నారాయణరెడ్డి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె.. ఆయన్ను తాను నిన్ననే ప్యాయంగా పలకరించానని గుర్తు చేసుకున్నారు. నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అయినందువల్లే.. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపించారు.
మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా వైసీపీ కర్నూలు జిల్లా బంద్ కు పిలుపు నిచ్చింది. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్ డిపోల ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ అధ్యక్షుడు గవర్నర్ నరసింహన్ ను కలసి టీడీపీ హత్యారాజకీయాలపై ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాకు వెళ్లి నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు.