ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశం మఖ్దూం భవన్ లో మంగళవారం జరిగింది. తమ్మినేని వీరభద్రం, డి.జి.నర్సింహారావు (సీపీఎం), మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య, హనుమేశ్ (సీపీఐ ఎంఎల్ –న్యూడెమొక్రసీ), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ), రవిచంద్ర, నలమాస కృష్ణ (టీపీఎఫ్) భూతం వీరన్న (సీపీఐ– ఎంఎల్), తాండ్ర కుమార్, ఉపేందర్రెడ్డి (ఎంసీపీఐ– యూ), జె.జానకిరాములు (ఆర్ఎస్పీ), గాదె ఇన్నయ్య (తెలంగాణ ప్రజావేదిక), సజయ పాల్గొన్న ఈ సమావేశంలో రిటైర్ద్ ప్రొఫెసర్ కోదండ రాం మాట్లాడుతూ:
ధర్నాచౌక్, సచివాలయం తరలింపు వెనుక రియల్ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని ప్రభుత్వం స్వప్రయోజనం లేని ఏ పనీ చేయదని అందరికీ తెలుసు అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు.
సమావేశం అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, ధర్నా చౌక్ చుట్టూ ఉన్న స్థానిక బస్తీలను ఎత్తివేసి, హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న సహజ ప్రకృతితో విలసిల్లే విలువైన ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే యత్నం జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు.
ధర్నాచౌక్, సచివాలయం తరలింపు ద్వారా ప్రజల సమిష్టి ఆస్తులను ఒకరిద్దరు వ్యాపారులకు తాకట్టుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సచివాలయాన్ని పరేడ్ గ్రౌండ్
లో నిర్మించడంపై అక్కడి వాకర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తూ తీర్మానించిందని కోదండరాం వెల్లడించారు.
ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమం కొనసాగింపుగా ఈ నెల 28న ఇందిరాపార్కు పరిసర బస్తీల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు.