ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సత్తా చూపించేది ఎన్నికల్లోనే. ఎంతటి మహామహులనైనా మట్టి కరిపించి తమ ఓటు విలువని ఎన్నికల్లో జనం చాటి చెబుతారు. గతంలో ఎన్నోసార్లు మౌన విప్లవంలాగా జనం ఎన్నికల్లో తమ తీర్పు చెప్పారు. కాకపోతే.. జనం తీర్పు చెప్పేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే. మరి మూడేళ్ల క్రితం ఎన్నికైన మోడీ సర్కారు పట్ల జనం అభిప్రాయం ఏంటి..
ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఇలాంటి అంశాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే.. ఈ అంశాలపై ఓ జాతీయ పత్రిక సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ విజయ దుందుభి మోగించి మరోమారు అధికారంలోకి వస్తుందని సదరు ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది.
అంతే కాదు.. 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలే వస్తాయని ఆ సర్వే చెప్పింది. సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది బీజేపీకి ఓటేశారు. ఈరోజు కనుక ఎన్నికలు జరిగితే 2014 ఎన్నికల నాటి ఫలితాలు, లేదంటే అంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. 61 శాతం మంది మాత్రం 2014 ఎన్నికలంత ఘన విజయం లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
23 శాతం మంది మాత్రం 2014 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. తృణమూల్, సీపీఐ మద్దతుదారులుగా భావిస్తున్న వారిలో 74 శాతం మంది కూడా బీజేపీనే గెలుస్తుందని చెప్పడం విశేషం. ఔను మరి ఇంతటి మద్దతు ఉన్నందువల్లే మోడీ నోట్ల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. మోడీ జోరు చూస్తే.. పదేళ్లు వరుసగా పాలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.