తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి విషయంలోనూ పోటీపడుతున్నాయి. స్పర్ధయా వర్థతే విద్యా అన్నారు పెద్దలు.. అంటే పోటీ ఉన్నప్పుడు విద్య వృద్ధి అవుతుంది అని..ఇప్పుడదే జరుగుతోంది. గతంలో తెలంగాణ నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లలు పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు అధిరోహించారు. ఇందుకు తెలంగాణ సర్కారు అన్నివిధాలా అండదండలందించింది.
తెలంగాణ విద్యార్థులు సాధించిన ఈ ఘనత అప్పట్లో సంచలనమైంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కూడా అదే ప్రయత్నం చేసింది. తెలంగాణ కంటే ఇంకా ఎక్కువ మందిని ఎవరెస్ట్ అధిరోహణకు పంపింది. విజయం సాధించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులకు ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా సన్మానించారు. అతేకాదు.. 10 లక్షల రూపాయల బహుమతి ప్రకటించారు.
ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒకే దఫా 14 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారని ఏపీ అధికారులు చెబుతున్నారు. వీరిని తీర్చిదిద్దిన కోచ్ శేఖర్ బాబుకు కూడా 10 లక్షల రూపాయలు కానుకను చంద్రబాబు ప్రకటించారు. ఈ సాహస యాత్ర కోసం ఏపీ పెద్ద కసరత్తే చేసింది.
సాంఘిక సంక్షేమం, గిరిజన, యువజన సర్వీసుల విభాగాల నుంచి మొత్తం 65 మందిని మొదట ఎంపిక చేశారు. వారిలో తొలివిడతలో 30 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత కొంత శిక్షణ తర్వాత చివరకు 19 మందితో సాహస యాత్ర ప్రారంభించారు. చివరకు 14 మంది విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించారు. ఆ వెనుదిరిగిన ఐదుగురు విద్యార్ధులకు కూడా 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ఏపీ ప్రకటించింది.