ఏపీ చంద్రబాబును ఐఏఎస్ టాపర్లు పొగడ్తలతో ముంచెత్తారు. నవ నిర్మాణదీక్ష లో భాగంగా చంద్రబాబు ఇటీవల ఐఏఎస్ లో టాప్ ర్యాంకులు సాధించిన 22 మందిని సన్మానించారు. ఈ సందర్భంగా టాపర్లు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ బాబును ఆకాశానికెత్తేశారు.
చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని గోపాలకృష్ణ అన్నారు. తనకు ఎప్పుడైనా నిరాశ, నిస్పృహ కలిగితే.. యూ ట్యూబ్ లో కెళ్లి చంద్రబాబు వీడియోలు చూసేవాడనని చెప్పుకున్నారు. ఆ వీడియోలు చూస్తే తనకు ఎక్కడలేని శక్తి వచ్చేదంటూ చంద్రబాబును పొగిడేశారు. తనకు ఏపీలో పని చేయాలని ఉందని, సీఎం చంద్రబాబు సలహాలు, సూచనలు పాటిస్తానని గోపాలకృష్ణ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు రుసుములు తగ్గించడం వల్లే తాము ఇంటికి కరెంటు పెట్టించుకున్నామని గోపాలకృష్ణ చెప్పారు. కరెంట్ కోసం డిపాజిట్ ను రూ.3 వేల నుంచి రూ.400 కు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు కాలంలోని డ్వాక్రా సంఘాల డబ్బుతోనే తనను చదివించినట్టు తన తల్లి చెప్పేదని గోపాలకృష్ణ అన్నారు.