ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి! పైగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవం! రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా, కేబినెట్ ర్యాంకుతో నియమించి ప్రభుత్వం ఆయనను గౌరవించింది. కానీ, ఆయనేం చేస్తున్నారో తెలుసా?
ఐవైఆర్ కృష్ణారావు, రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఆయనను పిలిచి మరీ గౌరవించింది. "అన్ని వర్గాలకూ అండగా ఉండాలి. అగ్రవర్ణ పేదలనూ ఆదుకోవాలి" అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా, కేబినెట్ ర్యాంకుతో కృష్ణారావును నియమించింది. కానీ, ఇప్పుడు అదే అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. ఇది సరికాదు కదా! అన్న వారితో "నావైఖరి అంతే" అని తేల్చి చెబుతున్నారు.
తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఒక మహిళా ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. "సోషల్ మీడియాలో ఏవైనా విమర్శలు చేస్తే సరదాగా తీసుకోవాలి. కానీ, కేసులు పెట్టడం నియంతృత్వానికి దారి తీస్తుంది" అని కృష్ణారావు ఫేస్బుక్లో పేర్కొన్నారు.
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి-2 (ది కంక్లూజన్) సినిమా అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్నీ తప్పుపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ సింఘాల్ను నియమించడాన్ని కూడా ఐవైఆర్ ప్రశ్నించారు. తెలుగేతర అధికారులను టీటీడీలో నియమించడం మంచి పద్ధతి కాదన్నారు.
ఇలా ప్రభుత్వం నియమించిన పదవిలో ఉన్న ఆయన ప్రభుత్వ విధానాలను ఫేస్-బుక్ వేదికపై విమర్శించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రతిస్పందించగా, తన వైఖరి అదేనని ఇందులో వెనక్కి తగ్గాల్సిందేమీ లేదని కృష్ణారావు ఫేస్బుక్ వేదికగానే బదులిస్తున్నారు. ఆయా అంశాలపై వ్యక్తి గతంగా తన అభిప్రాయాలు చెప్పి ఊరుకోవడమే కాదు, ఆయన అంతకుమించి మరీ ముందుకు వెళ్తున్నారు.
ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా విమర్శిస్తూ పెట్టే కొన్ని పోస్టులను తన ఫేస్బుక్ వాల్పై షేర్ చేస్తున్నారు. ఒకరి పోస్టులను ఇలా షేర్ చేయడమంటే, అదినచ్చి, దానికి మద్దతుపలికినట్లే నేరుగా ముఖ్యమంతి చంద్ర బాబును సూటిగా తప్పు పడుతున్న కామెంట్స్, ఫొటోలను సైతం ఐవైఆర్ షేర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కులపిచ్చి అంటగట్టే పోస్టులనూ తన వాల్పై పంచుకుంటున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, పేద బ్రాహ్మణులకు అందిస్తున్న సహాయం, అమలు చేస్తున్న పథకాల వంటి ప్రస్తావన మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
గత కొన్నాళ్లుగా ఫేస్బుక్కే పరిమితమైన ఐవైఆర్ వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. "ప్రభుత్వం ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్" గా నియమించింది. సంస్థకు నిధుల కొరత లేకుండా చూస్తోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల బ్రాహ్మణులు కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. ఇంత చేస్తున్న ప్రభుత్వం పైనే ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించడం సరికాదు" అని ప్రభుత్వ వర్గాలు భావి స్తున్నాయి.
ఆయన తన అభిప్రాయాలను, సూచనలను నేరుగా ప్రభుత్వానికి చెప్పే అవకాశమున్నా, ఫేస్బుక్ వేదికగా విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి బొండా ఉమా ఎలక్ట్రానిక్ మీడియా ముందు స్పందించారు. కృష్ణారావు సరికాదని తెలిపారు. "ప్రభుత్వ విధానాలపై నమ్మకం లేకపోతే మీరు తక్షణం ఆ పదవికి రాజీనామా చేయండి. పేద బ్రాహ్మణులకు సహాయం చేయగల సమర్థులు, అనుభవజ్ఞులైన వారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరిని ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తుంది" అంటూ ఫేస్బుక్ వేదికగానే డిమాండ్లు కూడా మొదలయ్యాయి.