పాముకు పాలుపోసి పెంచితే అయ్యోపాపం! పాలుపోశారు కదా అని వాళ్ళను పాము వదలి పెట్టటం జరగదు. దాని సహజ గుణమైన పాలు పోసిన వారిని తప్పకకాటు వేసి తీరుతుంది. అదే జరుగుతుంది చైనాకు పాకిస్థాన్ విషయంలో. తన సహజ గుణమైన విషం చిమ్మే లక్షణాన్ని చైనాపై కూడా చూపించి చైనాకు షాక్ ఇచ్చింది పాకిస్థాన్.
అన్ని కాలాల్లోనూ తన మిత్రపక్షమని ఘనంగా చెప్పుకొనే చైనాకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
పాకిస్థాన్లో పర్యటించాలనుకునే చైనాజాతీయుల కోసం కొత్త వీసానిబంధనలను పాకిస్థాన్ హోంశాఖ బుధవారం జారీచేసింది. కల్లోలిత బెలూచిస్థాన్లో ఇద్దరుచైనీయులు అపహరణకు గురై హత్యకావడం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరు చైనీయులు బిజినెస్ వీసాలను దుర్వినియోగం చేసి తమ దేశం లో క్రైస్తవాన్ని ప్రచారం చేశారని పాక్ చెప్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చే చైనీయులకు సంబంధించిన వీసా నిబంధనలను ఆ దేశం కఠినతరం చేసింది.
ఈ నిబంధనల ప్రకారం పాక్ బిజినెస్ వీసాలు కావాలంటే, చైనాలోని పాకిస్థాన్ ఎంబసీ గుర్తించిన సంస్థ నుంచి ఆహ్వానం పొందాల్సి ఉంటుంది. పాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుమతితో పాటు పలువురు చైనా అధికారులు అనుమతి ఉంటేనే ఆ దేశవాసులకు బిజినెస్ వీసాలు ఇస్తామని పాక్ స్పష్టం చేసింది.