ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు సొంత పార్టీలో ఎవ్వరూ ధీటుగా లేకుండా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతున్నట్టే కనపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా తన గురువు అద్వాని పేరును ఆయన ఫైనలైజ్ చేయాల్సిన టైంలో మోడీ చాలా తెలివిగా వ్యవహరించారు. దళిత కార్డు ప్రయోగించి రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కనీసం ఈ విషయంలో అద్వానికి సానుభూతి కూడా లేకుండా పోయింది.
ఇక దక్షిణాదిలో బీజేపీ పరంగా చాలా సీనియర్ అయిన వెంకయ్యనాయుడుకు కేంద్రంలో మోడీ కంటే ఎంతో రాజకీయ అనుభవం ఎక్కువ. ఆయన చాలా విషయాలను తనదైన స్టైల్లోనే చక్కపెడతారు. ఇక కొద్ది రోజులుగా వెంకయ్యకు మోడీ చెక్ పెట్టేందుకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వెంకయ్యకు మోడీ ఎలా చెక్ పెడతారా ? అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి.
ఇక ఎప్పుడు ఎవరికి చెక్ పెట్టాలో...బాగా తెలిసిన మోడీ ఇప్పుడు వెంకయ్యకు ఉప రాష్ట్రపతి పదవితో చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టే జాతీయ రాజకీయ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. వెంకయ్యను కేంద్ర రాజకీయాల్లో లేకుండా చేసేందుకు కొద్ది రోజులుగా మోడీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతేడాది వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సమయంలోనే ఆయన్ని ఈశాన్య రాష్ట్రాలకు కాని., జమ్మూ కశ్మీర్కు కాని గవర్నర్గా పంపుతారని ప్రచారం జరిగింది. అయితే తాను ప్రతక్ష్య రాజకీయాల్లోనే ఉండాలని కోరడంతో చివరకు ఆయన్ను మోడీ ఏం చేయలేకపోయారు.
పైగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఉండగానే., సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కూడా వరించింది. పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం వెంకయ్య విషయంలో మోడీ సీరియస్గానే ఉన్నారు. ఏపీలో బీజేపీ బలపడకుండా ఉండడం వెనక బాబు - వెంకయ్య దోస్తీయే కారణమని మోడీ భావిస్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల మీద కూడా ఆయనకు పట్టు ఉండడంతో మోడీ ఇప్పటి వరకు వెంకయ్యను ఏం చేయలేకపోతున్నారు.
వెంకయ్యను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేస్తే ఆయనకు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోసించే ఛాన్స్ ఉండదు. అయితే వెంకయ్య మాత్రం ఉప రాష్ట్రపతిగా వెళ్లేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరట. వెంకయ్య ప్రత్యర్థులు మాత్రం ఆయన ఉప రాష్ట్రపతిగా వెళితే తమకు మంచి ఛాన్స్ వస్తుందని తెగ సంబరపడిపోతున్నారట. ఇక ఎప్పుడు ఎవరికి ఎలా చెక్ పెట్టాలో బాగా తెలిసిన మోడీ వెంకయ్యకు ఇలా దెబ్బేస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది.