ఏపీ సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేల పట్ల ఓలా, ఎమ్మెల్సీల పట్ల మరోలా వ్యవహరిస్తోన్న తీరుతో పార్టీలో ఆయనపై చాలా మంది గరం గరం లాడుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పేసింది. చంద్రబాబు మాటను సైతం చాలా మంది లెక్క చేయడం లేదు. ఇక చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే విసిగిపోయిన చంద్రబాబు అవినీతి ఆరోపణలు, భూకబ్జా కేసుల్లో చిక్కుకున్న ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, గుణపాటి దీపక్రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఎమ్మెల్సీల విషయంలో ఉపేక్షించని చంద్రబాబు భూ కబ్జా కేసులు, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. అనకాపల్లి ఎమ్మెల్యే భూ కబ్జా కేసును పోలీసులు నమోదు చేశారు. సిట్ దర్యాప్తులో భాగంగా పీలా గోవింద్ భూ ఆక్రమణకు పాల్పడినట్లు తహసిల్దార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పీలా గోవింద్ తప్పు చేసినట్టు తహసిల్దార్ ప్రాథిమిక దర్యాప్తులో తేలితే ఆయన మాత్రం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మహారాష్ట్రలో చేపట్టిన ఇరిగేషన్ కాంట్రాక్టు పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. అయితే బొల్లినేని రామారావు కూడా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నారు.
అయితే భారీ ఆరోపణలు వచ్చిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు గతంలో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీలో ఎమ్మెల్సీలకు ఓ న్యాయం ? ఎమ్మెల్యేలకు ఓ న్యాయమా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలోనే కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరిపై ఆరోపణలు రుజువైతే అప్పుడైనా చంద్రబాబు వీరిపై చర్యలు తీసుకుంటారా ? లేదా ? అన్నది చూడాలి.