రైతులపై మోదీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై తాము ఎన్నో ఆందోళనలు చేపట్టామని రాహుల్ చెప్పారు. అయినా మోదీ సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదన్నారు.
పార్లమెంటులో రైతుల సమస్యలపై ప్రస్తావించేందుకు ప్రయత్నించినా కూడా మోదీ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కూడా సభలోనే ఉన్నారని.. అయినా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దీన్ని బట్టి రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్నారు. ఇది రైతుదేశమని, అమెరికాది కాదని రాహుల్ గుర్తు చేశారు.
జీఎస్టీ వ్యవహారంలో కూడా మోదీ సర్కార్ తొందరపడిందని రాహుల్ విమర్శించారు. అర్ధరాత్రి జీఎస్టీకోసం పార్లమెంటు తలుపులు తెరిచిన మోదీ.. రైతులపై మాత్రం ఆ పాటి శ్రద్ధ చూపించడం లేదన్నారు. తాము రూపొందించిన జీఎస్టీ వేరని.. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ వేరని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుత జీఎస్టీతో చిన్న వ్యపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత జీఎస్టీ బడావ్యాపారులకు అనుకూలంగా ఉందన్నారు. పెద్ద కంపెనీలు ఎంతమంది అకౌంటెంట్లనైనా నియమించుకుని అప్లికేషన్లు నింపగలుగుతాయని.. చిన్న వ్యాపారులు అలా చేయలేరని రాహుల్ చెప్పారు.
ప్రస్తుతం మోదీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ అన్నారు. చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించిన తర్వాత జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.