భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, భూమా 2014లో వైసీపీ నుంచి గెలవడం.. తర్వాత మంత్రి పదవిపై ఆశతో టీడీపీ చెంతకు చేరడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నంద్యాల సీటును మాదంటే మాదని వైసీపీ, టీడీపీలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తమ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఇరు పక్షాలూ డిసైడ్ అయ్యారు. జగనంటే చంద్రబాబుకి, బాబంటే జగన్కి అస్సలు పడని నేపథ్యంలో ఈ ఉప పోరును ఇరు పక్షాలూ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని శక్తులూ ఒడ్డుతున్నాయి.
ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో ప్రభుత్వం పైచేయి సాధిస్తోందని చెప్పకతప్పదు. ముఖ్యంగా అధికార యంత్రాన్ని పూర్తిగా అక్కడ మోహరించింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులను సైతం చకచకా చేయిస్తోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కోడ్తో ఎలాంటి పనీ చేయడానికి ఉండదని గుర్తించిన చంద్రబాబు ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించడంతోపాటు.. పనులను కూడా వేగంగా చేయిస్తున్నారు. అదేసమయంలో వందల కోట్ల రూపాయలు సైతం చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా భూమా తనయ, మంత్రి అఖిల ప్రియ తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో పూర్తిస్థాయి పట్టును సాధించాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే.. పూర్తి బాధ్యత తనదేనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా మంత్రి ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనికితోడు చంద్రబాబు ఈ ఉప పోరును తన మూడేళ్ల అభివృద్ధి పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు. దీంతో ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఈ సీటును టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మంత్రులను సైతం నంద్యాలలో మోహరించారు. మంత్రి నారాయణ పూర్తిగా కొన్ని రోజులు నంద్యాలకే పరిమితం అయిపోయి పనులు చక్కబెట్టారు.
ఇక, ఇప్పుడు పనులతోనే పని జరగదని భావించిన అధికార పక్షం.. ఓట్ మేనేజ్ మెంటు కోసం అధికార పార్టీ రూ. 40 కోట్లు వరకూ ఖర్చు పెట్టబోతోందంటూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచీ ఓ సర్వే చేయించుకుని, దాని ఆధారంగా ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టాలీ, ఓటర్లు కోసం ఎంత ఖర్చు చేయ్యాలనే అనే ప్లానింగ్ తో అధికార పార్టీ ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో విపక్షం కూడా ఇంతో పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
నంద్యాల ఎన్నికల ఖర్చు విషయంలో శిల్పా మోహన్ రెడ్డితో మొదటే ఒక డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసిందే. ఎన్నికల ఖర్చంతా తానే పెట్టుకుంటాననీ, వైసీపీ నుంచి టిక్కెట్టు ఇస్తే చాలనే ఎగ్రిమెంట్ తోనే ఆయన పార్టీ మారినట్టు చెప్పుకున్నారు. దీంతో ఎన్నికల ఖర్చంతా ఆయన ఒక్కరి భుజస్కందాలపైనే ఉందని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంతలేదన్నా.. రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే, అధికార పక్షం మరింతగా కూడా ఖర్చుకు వెనుకాడే స్థితి లేకపోవచ్చని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.