డ్రగ్స్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తెరాసతో సంబంధాలున్న వ్యక్తులను విచారిస్తారో? లేదో? అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్.. వయసుకు తగిన పనులు చూసుకోవాలంటూ దీటుగా సమాధానమిచ్చారు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా పట్టుబడడంతో సినీ ప్రముఖులను ప్రత్యేక పోలీసు బృందం(సిట్) విచారిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో అతిపెద్ద డ్రగ్స్ కుంభకోణం.
ప్రభావితం చేయగల తెరాస నేతల మిత్రులు కూడా ఉన్నారు. మరి వారిని రక్షిస్తారా..? విచారిస్తారా? వేచి చూడాలి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. దిగ్విజయ్ ట్వీట్పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘మీరు పూర్తిగా ఓడిపోయారు సర్. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయసుకు తగిన పనులు చూసుకుంటే మంచిది. ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ ను ఆయన నేర్చుకున్నారని, అందుకు సంతోషమని సెటైర్ వేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. కాగా, గతంలో దిగ్విజయ్ ఓ ట్వీట్ చేస్తూ, తెలంగాణ స్పెల్లింగ్ ను తప్పుగా రాసిన సంగతి తెలిసిందే. గతంలోనూ కేటీఆర్.. దిగ్విజయ మధ్య ఇలాంటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులపై అప్పట్లో దిగ్విజయ్ సింగ్ వివాదాస్ప వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.