ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద క్రీడా సంబరం ఒలంపిక్స్. మరి అలాంటి ఒలంపిక్స్ ను జరిపించాలంటే మాటలా..? కానేకాదు అందుకు పటిష్ట ఆర్ధిక ప్రణాళిక అవసరం. మరి ప్రస్తుతం భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంతటి సాహసం తగునా..? 2032 లో భారత్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ భారత్ ఈ సాహసానికి ఒడిగడుతుందా..? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానమే విస్పష్టం.
కారణం ఇతకుముందు ఒపంపిక్స్ నిర్వహించి ఆర్ధిక కష్టాలను ఎదుర్కొన్న దేశాలను చూస్తే మనలాంటి దేశం అందుకు అస్సలు సాహసించదని చెప్పక తప్పదు. ఒలింపిక్ నిర్వహించడం వల్ల ఆ దేశాలు లాభపడకపోగా నష్టాల పాలైనాయని తెలిసిందే. ఒకవేళ 2032 ఒలింపిక్ క్రీడలు ఇక్కడ నిర్వహించాలనుకుంటే దీనికి సంబంధించిన బిడ్డింగ్ 9 సంవత్సరాల ముందుగా అంటే 2025లో వేయాల్సి ఉంటుంది. ఈలోగా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఒలింపిక్స్ నిర్వహణలో పెనవేసుకుని ఉన్న భారీ ఖర్చుల నేపథ్యంలో చాలా దేశాలు వాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరి ఈ సమయంలో గొప్పలకు పోయి మన దేశం ఉన్న ఆర్ధిక సంపత్తిని కాస్తా పోగొట్టుకుంటుందా..? లేక తెలివిగా వ్యవహరించి సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరిస్తుందా..? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.