సిక్కిం, భూటాన్ లకు సమీపంలోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత సైనికుల మోహరింపుతో పరిస్థితులు ఉద్రిక్తమైన వేళ, చైనా మాజీ రాయబారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కొంటారు. ఒకటి స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, లేదా పట్టుబడటం.. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే.. ఆ సైనికులు చంపపడొచ్చు' అని ఆయన చెప్పుకొచ్చాడు.
భారత్ ముందు మూడు ఆప్షన్స్ ఉంచామని, వాటిల్లో ఏది ఎంచుకుంటుందోనని తాము వేచి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అర్థవంతమైన, సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని మాత్రమే భారత్ ఎంచుకుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. సిక్కిం సరిహద్దుల్లో డొక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు చైనా మీడియా, అటు ఆ దేశం అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
ఒకవైపు చైనా మీడియా యుద్ధం తప్పదన్న రీతిలో రాతలు కొనసాగిస్తుండగా.. ఈ ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారం లేనేలేదని, బేషరతుగా భారత్ తన బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాల్సిందేనని డ్రాగన్ బుసలు కొడుతోంది. మరి ఇప్పుడు చైనా ఆఫర్ ను భారత స్వీకరించి సైన్యాన్ని వెనక్కి పిలుస్తుందా..? లేక సమరానికి మేము కూడా సిద్ధమే అని కయ్యానికి కాలు దువ్వుతుందా.. చూడాలి.