భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఈ నెల 25 భాధ్యతలు చేపట్టనున్నారు. అనూహ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తెరపైకి వచ్చి అంతే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్నాథ్ కోవింద్. దీంతో దేశ అత్యున్నత పీఠాన్ని రెండోసారి దళితుడు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. గతంలో తొలిసారి దళిత వ్యక్తి అయిన కేఆర్ నారాయణన్ పదో రాష్ట్రపతిగా (1997లో)ఈ పదవిని అలంకరించగా తాజాగా కోవింద్ దక్కించుకున్నారు.
కోవింద్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 197-79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు.
1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 198-93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కాన్సుల్గా పని చేశారు. కోవింద్ 1986 లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్ కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరే కంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు.
ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కోవింద్ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదాస్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సన్నిహితునిగా పేరుంది.
కోవింద్ తొలిసారి 1991 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు.
యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్ 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు.