అకున్ సబర్వాల్ ఈ పేరు వింటనే చాలు, నేరస్థుల వెన్నులో వణుకుపుట్టాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య కాలంలో డ్రగ్స్ మాఫియాపై ఆయన ఉక్కుపాదం మోపారు. గతంలో నకిలీ మందుల తయారీ, నకిలీ విత్తనాల తయారీ, గుండుబా తయారీ.
అయితే డ్రగ్స్ కేసులో విచారిస్తుంది సామాన్యులను కాదు సొసైటీలో సెలబ్రెటీస్. అందుకే ఈ విషయంలో కాస్త ఆచీ తూచి వ్యవహరించాల్సి వస్తుంది. అంతే కాదు విచారణ సమయంలో అన్ని విషయాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కాకపోతే మీడియా అక్కడి వాతావరణాన్ని కాస్త వేడి గా చూపిస్తుంది. సిట్ విచారణకు హాజరైన వారి క్లిప్లింగ్స్ పదే పదే చూపించి సాామాన్యులకు క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక ఈ విషయంలో సిట్ బృందం అన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
సిట్ బృందంలోని సభ్యుల్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. రోజంతా జరిగే ఇంటరాగేషన్ను రెండు, మూడు సెషన్స్గా విభజించారు. ఒక్కో సెషన్లో ప్రశ్నించే బాధ్యతను ఒక్కో బృందానికి అప్పగిస్తున్నారు. ఏ బృందం లో ఏ అధికారి ఉంటారో చివరి నిమిషం వరకు తెలియదు. ఇన్స్పెక్టర్ ఆపై స్థాయిలో వారి ట్రాక్ రికార్డు ప్రకారం ఎంపికచేసిన 25 మంది ని వినియోగిస్తున్నట్లు తెలిసింది. విచారణకు కొంత సమయం ముందు హెడ్ ఆఫీసులో ఫలానా సమయంలోగా అందుబాటులో ఉండాలని చెబుతున్నారు.
విచారణ గదిలోకి వెళ్లడానికి ముందు ఎంపికచేసిన అధికారులతో అకున్ సభర్వాల్ ప్రత్యేకంగా షార్ట్ డిస్కషన్ జరిపి, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలి, ఎంత సమయం ప్రశ్నించాలనేది చెప్పి పంపిస్తున్నారు. ఆ మేరకు ప్రశ్నలు అడిగి, నిర్ణీత సమయంలోగా సమాధానాలు రాబట్టి, బాస్కు సంబంధిత ఫైల్ అందజేసి వెనుదిరుగుతున్నారు. మొత్తం వీడియో రికార్డింగ్ జరుగుతుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫీ శ్యామ్ కే నాయుడిని విచారించిన సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించారు. ఒక్కో సెషన్కు యూపీఎస్సీ తరహాలో ప్రశ్నించడానికి కొంత సమయం ముందు సమాచారం అందిస్తుండటంతో తామే విచారిస్తామనే విషయం అధికారులకు తెలిసే అవకాశం ఉండదు. తమను ఎవరు విచారిస్తారో తెలుసుకుని మిలాఖత్ అయ్యే అవకాశం విచారణ ఎదుర్కొనేవారికి ఉండదు.
కెల్విన్ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెల్విన్ నుంచి సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై పెద్ద ఎత్తున సమాచారంతో పాటు ఆధారాలు సేకరించారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.