దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అధిష్టానం ఎప్పుడు ఎలాంటి అవకాశం చిక్కినా వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా తమిళనాడులో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకపోవడాన్ని చిన్నబుచ్చుకుంటున్న ఆ పార్టీ ఆ రాష్ట్రంలోనే జెండా ఎగరేయాలని ప్రయత్ని స్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. సీఎం జయలలితం మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అప్పటి ఏఐఏడీఎంకే అధినేత్రిగా ఉన్న శశికళకు ఛాన్స్ ఇవ్వకుండా చేసిందనే కామెంట్లు బీజేపీని చుట్టుముట్టాయి.
ఆ తర్వాత పన్నీర్ సెల్వంను తన దారిలోకి తెచ్చుకోవడం ద్వారా బీజేపీ జెండా ఎగరేయాలని నిర్ణయించారు. అయితే, అనూహ్యంగా ఎడప్పాడి పళనిసామి సీఎం అయిపోయాడు. అయితే, ఈ సందర్భంలోనూ కేంద్రం చక్రం తప్పింది. తమకు అనుకూలంగా ప్రభుత్వాన్ని మార్చుకుంది. అయితే, బీజేపీ జెండా ఎగిరే పరిస్థితి మాత్రం కనిపించలేదు. దీంతో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రాజకీయంగా రంగంలోకి దింపేందుకు రెడీ అయింది. అది ఇదిగో అంటూ హడావుడీ మొదలైంది. అయితే, ఇంతలోనే ఆయన తన జాతకం బాగాలేదని పేర్కొంటూ సైలెంట్ అయిపోయాడు.
అయితే, బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోలేదు. విశ్వనాయకుడు కమల్ హాసన్ను ఇప్పుడు దువ్వుతోంది. ఇటీవల ఆయన ఎడప్పాడి పాలన బాగోలేదని చేసిన కామెంట్తో ఇక, కమల్ పొలిటికల్గా రంగంలోకి దిగిపోతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, కమల్ను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఉత్సాహ పడుతోంది.
ఈ క్రమంలోనే జయలలిత మరణం ద్వారా ఖాళీ అయిన ఆర్కె నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నికలో.. కమల్ హాసన్ బరిలోకి దిగితే గనుక తాను తప్పుకుంటానని.. ఇప్పటికే అక్కడ బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్న కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అన్నాదురై కూడా కమల్ కే జై కొడుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా కమల్ బెస్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. సో. దీనిని బట్టి.. కమల్ హాసన్ పార్టీ అంటూపెడితే.. తమ జట్టులో కలిపేసుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మరి కమల్ అంత తేలికగా లొంగుతాడా? రజనీ మాదిరిగా ఊరించి ఉసూరు మనిపిస్తాడా ? చూడాలి. ఏదేమైనా తమిళనాడు లాంటి కరడు గట్టిన ప్రాంతీయ వాదం ఉన్న రాష్ట్రంలో బీజేపీ వంటి కాషాయ పార్టీ జెండా ఎగరడం అంత వీజీ కాదని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా డీఎంకే అధినేత కరుణానిధి వంటి వారు బీజేపీకి ప్రథమ శతృవులుగా ఉన్నంత వరకు కమల నాథుల కలలు తీరేవి కావని చెబుతున్నారు.