రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలుగు మీడియా అంటే కేరాఫ్ హైదరాబాద్. తెలుగులో ప్రధాన దినపత్రికలు, మీడియా ఛానెల్స్ ప్రధాన కేంద్రాలన్ని హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసేవి. ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయ్యిందో అప్పటి నుంచి ఏపీ వార్తలకు, ఇటు తెలంగాణ వార్తలకు సపరేట్గా కవరేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచే ఏపీ వార్తలను కవర్ చేయడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే ప్రధాన దినపత్రికలు అన్నీ తమ ప్రధాన కార్యాలయాలను విజయవాడకు తరలించేశాయి.
దినపత్రికలు అన్ని ఏపీ, తెలంగాణకు సపరేట్గా ఎడిషన్లు ఇస్తున్నాయి. ఇక న్యూస్ ఛానెల్స్ విభాగానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ను కవర్ చేస్తున్నాయి. ఈటీవీ, 6 టీవీ మాత్రం రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఛానెల్స్ రన్ చేస్తున్నాయి. ఇక టీ న్యూస్ ఛానెల్ కేవలం తెలంగాణ వార్తలతో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే కేవలం ఏపీ వార్తల కవరేజ్ కోసమే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ‘ఏపీ టైమ్స్’ ఛానల్ రెడీ అయ్యింది.
అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ ఛానెల్ ఇక ప్రారంభమే తరువాయి అనుకుంటున్న టైంలో ఈ ఛానెల్కు పెద్ద షాక్ తగిలింది. టైమ్స్ గ్రూప్ ఏపీ టైమ్స్ ఛానెల్ ప్రసారాలకు ముందే బ్రేక్ వేసింది. ఈ కొత్త ఛానెల్ లోగో అచ్చు గుద్దినట్టు టైమ్స్ నౌ లోగోను పోలి ఉండడంతో ఈ నోటీసులు జారీ అయినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
విజయవాడ కేంద్రంగా ఇప్పటికే ప్రసారాలు ప్రారంభం కావాల్సిన ఈ ఛానెల్ ప్రసారాలు తాజా నోటీసులతో కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ నోటీసుల నేపథ్యంలో టైమ్స్ తన లోగోను మార్చుకోవాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న ఏపీని అలాగే ఉంచి... టైమ్స్ పేరు దగ్గర చివర్లో జెడ్ యాడ్ చేశారు.