పార్టీలో పట్టు పెంచుకోకుంటే పాలన సక్రమంగా జరగదని భావించిన సీఎం పళినిస్వామి ... చీలిక ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆధ్వర్యంలో ఉన్న అన్నాడీఎంకే పరచ్చితలైవి పార్టీలో ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిపై పళనిస్వామి ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టినట్టు తెలుస్తోంది. ఓపీఎస్ ముఖ్య అనుచరుడిగా పేరొందిన కౌండంపాళయం ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి.. పళనిస్వామి గూటికి చేరిపోయారు.. దీంతో పన్నీరు సెల్వంకు గట్టి షాక్ తగిలినట్లయింది..
పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కేంద్రంలోని అధికార బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం పళనిస్వామి.. కేంద్రానికి బేషరతు మద్దతు ప్రకటించడంతో బీజేపీ తన స్ట్రాటజీ మార్చుకుంది. పళనిస్వామికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పన్నీరుసెల్వం వర్గీయులు.. పునరాలోచనలో పడిపోయారు. అందుకే ఒక్కొక్కరే పళనిస్వామి పంచన చేరిపోతున్నారు. త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు అధికార అన్నాడీఎంకేలోకి రావడం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.