ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత అనే మాటలు అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్లో ఇకపై వినిపించవు! ఇక నుంచి అధికారం కోసం, అధికారం కొరకు, అధికారం చేత.. అనే మాటలే వినిపించనున్నాయి!! ఘనత వహించిన మోడీ గారి ఏలుబడిలో రాజకీయం అంటే ఎలాంటి మలుపులు తిరుగుతోందో? ఎంతలా దిగజారిపోతోందో? సాక్షాత్తూ.. బీజేపీకే చెందిన సీనియర్ నేత, తెలుగు వాడు రామ్ మాధవ్ నిన్న కుండబద్దలు కొట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మోడీ మార్క్ రాజకీయం.. కేవలం వాడుకుని వదిలేయడమే!! ఇందులో ఎలాంటి మొహమాటాలకూ ఛాన్స్ లేదు. అంతేకాదు, మనోడే కదా అని జాలి చూపిస్తే.. అది రాజకీయమే కాదని కూడా రామ్ మాధవ్ చెప్పడం సంచలనంగా మారింది.
విషయంలోకి వెళ్లిపోతే.. నిన్న హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ మాధవ్.. ఉద్వేగంగా ప్రసంగించారు. బీజేపీ దృష్టిలో రాజకీయం అంటే ఏంటో కుండబద్దలు కొట్టాడు. రాజకీయాలు చారిటీ(సేవ) కోసం కాదని, కేవలం పదవుల కోసమేనని, వాటిని నిలబెట్టుకోవడమే బీజేపీ పనిఅని చెప్పుకొచ్చాడు. మోడీ నాయకత్వంలో బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించడమే ధ్యేయంగా నిర్ణయించుకున్నామని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ అనుకూలంగా వాడుకుంటామని, అలా వాడుకున్నంత మాత్రాన వారితో కలిసిపోయినట్టు కాదని, అవసరం తీరాక ఎవరి దారి వాళ్లదేనని, సాయం చేశారన్న దృష్టి ఉంటే రాజకీయాలు పనికిరావని కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వాస్తవానికి ఏపీ మొదటి నుంచి, ఇటీవల రాష్ట్రపతి, జీఎస్టీ వంటి కీలక సమయాల్లో తెలంగాణ నుంచి కేంద్రం సాయం పొందింది. అడిగినా అడగకపోయినా.. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉన్నాడు. ఇక, కేంద్రంలో కయ్యం పెట్టుకుంటేనే కానీ ప్రత్యేక హోదా రాదని పలు సభల్లో చెప్పుకొచ్చిన జగన్.. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం ఎదురెళ్లి మద్దతు తెలిపారు. ఇలా.. కేంద్రానికి దక్షిణాదిలో బలమైన రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలు కేంద్రానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలపై అభిమానం చూపాల్సిన కేంద్రం.. ఇప్పుడు విషం కక్కుతోంది!
మోడీ మాటలనే నిన్న రామ్ మాధవ్ ఉటంకించారు. తెలంగాణలో బీజేపీ ఎదగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మాధవ్.. ఈ సందర్బంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఉన్నది అధికారాలను పంచుకోవడం కోసమేనని, రాజకీయాల్లో ఎవరూ మన అనేవారు ఉండబోరని, కేవలం పోటీ మాత్రమే ఉంటుందని, ఆధిపత్యంతోనే అంతిమంగా అధికారం సాధించుకోవచ్చని కార్యకర్తలకు నూరిపోశారు. రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ వంటి విషయాలు ఉన్నాయి కాబట్టే తాము తెలంగాణ సీఎం కేసీఆర్తో చెలిమి చేశామని, ఇప్పుడు అవి రెండూ అయిపోయాయి కాబట్టి ఈ క్షణం నుంచి ప్రభుత్వంపై పోరాటమే చేస్తామని చెప్పుకొచ్చారు.
ఈ సూత్రం అంతటా వర్తిస్తుందని చెబుతూ పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఉద్దేశించి అన్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీమిత్ర పక్షమే అయినప్పటికీ... అవసరానికి తాము ఎలా వ్యవహరిస్తామో ముఖ్యంగా మోడీ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మాధవ్ చెప్పుకొచ్చాడు. అంటే.. వచ్చే ఎన్నికల్లో బాబుకు బలం చాలదని తెలిస్తే.. వెంటనే బలమున్న నేతతో చేతులు కలిపేందుకు తాము రెడీ అని పరోక్షంగా హెచ్చరించాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాదు.. సబ్కా నెంబర్ ఆయేగా.. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావాలి. ఇది మోడీ సూత్రం అని మాధవ్ చెప్పడం గమనార్హం. కరడుగట్టి అధికార దాహం తప్ప మోడీలో ఏమీ లేదనేది స్పష్టమ వుతూనే ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.