ఏపీలో విపక్ష నేత జగన్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చాడు? ఎలాంటి సిట్యుయేషన్లో పార్టీ పెట్టాడు? వంటి కీలకమైన విషయాలు అందరికన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుసు. వైఎస్ హఠాన్మరణంతో సీఎం కావాలని కలలు కన్న జగన్.. అది ఫలించకపోయే సరికి.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీంతోనే కాలు రువ్విన విషయం తెలిసిందే.
అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు జగన్కి కోవర్టుల్లా మారిపోయారట! అవకాశం వచ్చిన ప్రతిసారీ జగన్కి ఏదో రూపంలో సాయం చేసేందుకు సిద్ధం అవుతున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీతోపాటు కాంగ్రెస్కి కూడా జగన్ అధ్యక్షుడుగా ఉన్నాడా? ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు, జగన్ల మధ్య ఉప్పునిప్పులా ఉంది. విభజనతో అతి పెద్ద జాతీయ పార్టీ ఒక్కసారిగా ప్రభావం కోల్పోయి.. 2014 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటను కూడా కైవసం చేసుకోలేక పోయింది. అయినా కూడా 2019 నాటికి పుంజుకుంటామని కనీసం 40 నుంచి 50 సీట్లను సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా పదే పదే చెబుతున్నారు.
ఇది ఎలా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ను ఆదరించే వారు ఒక్కరూ కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ పేరెత్తే కేడర్ కూడా కనిపించడం లేదు. అయితే, దీనిని సవాలుగా తీసుకుని కాంగ్రెస్ను బతికించుకోవాల్సిన నేతలు కూడా ఇప్పుడు ఆ ఊసుమానేసి... జగన్కి ఏ రకంగా సాయం చేద్దాం... అనే ధోరణిపైనే దృష్టి పెట్టడం గమనార్హం.