పవర్స్టార్ పవన్కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తన పొలిటికల్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఫుల్ టైం పొలిటిషీయిన్గా మారిపోనున్నాడు. పవన్ అనంతపురం సభలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తుందని ప్రకటించడంతో పాటు తాను అనంతపురం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తీరుతానని ప్రకటించాడు.
దీంతో జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు పవన్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖరారైంది. పవన్ ప్రకటన తర్వాత పవన్ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తాడా ? లేదా టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాడా ? అన్నదానిపై కూడా రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా పవన్ టీడీపీ+గద్దర్+కోదండ రాం లాంటి వాళ్లను కలుపుకునే వెళతాడని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జనసేన నుంచి పోటీకి కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో రాజధాని కేంద్రంగా ఉన్న విజయవాడ ఎంపీ సీటును పవన్ తనకు అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తికి ఇస్తానని మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త పీవీపీ. పీవీపీ గత ఎన్నికల్లోనే విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు.
జగన్తో విబేధించి వైసీపీ నుంచి బయటకు వచ్చిన పీవీపీ పవన్ కోటాలో టీడీపీ ఎంపీ టిక్కెట్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇక పవన్ జనసేన ఏర్పాటులో బ్యాక్ బోన్గా ఉన్నారన్న టాక్ కూడా వచ్చింది. ఆఖరుకు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ద్వారా కూడా చంద్రబాబుకు రికమెండేషన్ చేయించారట. చంద్రబాబు అప్పటికే కేశినేని నానికి మాట ఇచ్చి ఉండడంతో ఏం చేయలేకపోయారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న పీవీపీ పవన్ నుంచి ఇప్పటికే హామీ పొందినట్టు తెలుస్తోంది. పవన్ ఒంటరిగా పోటీ చేసినా లేదా టీడీపీతో జట్టుకట్టినా పీవీపీ కోసం మాత్రం విజయవాడ ఎంపీ సీటును ఖచ్చితంగా అడుగుతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై పీవీపీ నుంచి పవన్కు గట్టి హామీ కూడా వచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సైతం పవన్ ఎమ్మెల్యే టిక్కెట్టుపై హామీ ఇచ్చినట్టు టాక్.