నంద్యాల ఉప ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో రెండేళ్లు మాత్రమే సాధారణ ఎన్నికలకు గడువు ఉన్నప్పటికీ.. ఈ ఉప ఎన్నికకు అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండూ కూడా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గెలుపు మాదంటే మాదేనని ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఇరు పక్షాలూ సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. ప్రజలను అన్ని విధాలా మెప్పించే పనిలో పడ్డాయి.
ఈ క్రమంలోనే అటు చంద్రబాబు అభివృద్ధి పేరుతో ముందుకు సాగుతున్నారు. ఇక, వైసీపీ అధినేత నేరుగా రంగంలోకి దిగిపోయి.. రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రచారం ఉద్రుతం చేశారు. అన్ని రకాలుగా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, మొన్నామధ్య టీడీపీ తరఫున బరిలో నిలబడ్డ బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఏకంగా ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఎన్నికల పోలింగ్కు ముందుగా అటు బాలయ్య ప్రచారంతో పాటు ఇటు జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు ఇస్తాడన్న టాక్ కూడా వచ్చింది. దీంతో టీడీపీ లో జోష్ అంచనాలు మించిపోయింది. ఇక, దీంతో తీవ్ర ఆలోచనలో పడ్డ వైసీపీ వెంటనే తన అస్త్రాన్ని బయటకు తీసింది. వైసీపీతో గట్టి సంబంధాలు ఉన్న సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ద్వారా ప్రిన్స్ మహేష్ యూత్ను నంద్యాలలో దింపాలని వైసీపీ నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా అన్ని పూర్తి చేసింది.
ఈ క్రమంలో నంద్యాల, కర్నూలు మహేష్ బాబు అభిమానులతో శేషగిరిరావు సోమవారం భేటీ అయ్యారు. వారంతా వైసీపీ అభ్యర్థి శిల్పా తరఫున ప్రచారం చేసేలా ఒప్పించారు. వాస్తవానికి సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కాంగ్రెస్తోను, వైఎస్ ఫ్యామిలీతోను ముందునుంచి అనుబంధం ఉంది. వైఎస్ తర్వాత ఆదిశేషగిరిరావు వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్సభ సీటుకు వైసీపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోను కమ్మ సామాజికవర్గాన్ని, మహేష్ అభిమానులను వైసీపీకి మద్దతు ఇచ్చేలా తెరవెనక ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన నంద్యాల ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఆయన వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన మహేష్ అభిమానులను వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి గెలుపునకు కృషి చేసేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వారు రేపో రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. సో.. ఇలా నంద్యాలలో ఇక, మహేష్ బాబు యూత్ ప్రచారం హోరెత్తనుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాలో ఏమో?!